మూడు రోజులు వైన్ షాప్‌లు బంద్‌

మునుగోడు ఉప ఎన్నిక కోడ్‌ నేపథ్యంలో నవంబర్‌ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్‌ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి సంతోష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్‌షాపులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారంతా వైన్‌షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్‌లను సీజ్‌ చేసి.. 48మందిని అరెస్టు చేసి మొత్తం 118 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.5,59,000 ఉన్నట్లు తెలిపారు.