థ్రిలింగ్ త్రిపాటి తిప్పేశాడు

ప్ర‌పంచ‌మంతా అనుకుంది స‌న్‌రైజ‌ర్స్‌లో పేరున్న ఆట‌గాళ్లు లేర‌ని విస్మరించారు. ఒక్క మ్యాచ్ కూడా గెలుపొంద‌ర‌ని అనుకున్నారు. కానీ ప్ర‌తి ఒక్క‌రీ అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ వరుస విజ‌యాల‌ను త‌మ ఖాతాలో వేసుకుంటుంది. మెద‌టి రెండు మ్యాచులు ఓడిన మాత్ర‌న త‌మ టీంను త‌క్కువ అంచ‌నా వేయ‌ద్ద‌ని చాటి చెబుతున్నారు. ఇటు బౌలింగ్‌, అటు బ్యాటింగ్‌లో క‌ట్టుదిట్ట‌మైన ప్ర‌ణాళిక‌తో దూసుక‌పోతున్నారు.

ఇక నిన్న రాత్రి కోల్‌క‌త్తాతో జ‌రిగిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యం చిన్నబోయింది. ఈ పరాజయంతో కోల్‌కతా నాలుగో స్థానానికి పడిపోయింది.

176 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్‌కు ఆరంభం అంత కలిసిరాలేదు. 3 పరుగుల వద్ద అభిషేక్ శర్మ (3), 39 పరుగుల వద్ద కెప్టెన్ కేన్ విలియమ్సన్ (17) అవుటయ్యారు. అయితే, క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠి, మార్కరమ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. బంతిని నిర్దాక్షిణ్యంగా బాది స్టాండ్స్‌లోకి తరలించారు. ఫలితంగా హైదరాబాద్ గెలుపు నల్లేరు మీద నడకే అయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేసి అవుట్ కాగా, మార్కరమ్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబాద్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేసి నిరాశపరచగా నితీశ్ రాణా (54) అర్ధ సెంచరీతో రాణించాడు. చివర్లో ఆండ్రూ రసెల్ చెలరేగాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేసి జట్టు 175 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.