నాటుసారా తాతా 92 మంది మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో నాటుసారా తాగి మృతిచెందిన వారి సంఖ్య 92కి చేరింది. మీరట్‌లో 18 మంది, సహరాన్‌పూర్‌లో 46, రూర్కీలో 20, కుశీనగర్‌లో 8మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సహరాన్‌పూర్‌లో మృతిచెందిన వారికి పోస్టుమార్టమ్‌ నిర్వహించగా 36 మంది నాటుసారా కారణంగానే మృతి చెందినట్లు తేలిందని అక్కడి జిల్లా మేజిస్ట్రేట్‌ అలోక్‌ పాండ్యా తెలిపారు. కల్తీ సారా తాగి అనారోగ్యం పాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ. 50 వేలు ఇస్తామని ఆయన వెల్లడించారు.