కేంద్రానికి లేఖ రాసిన మంత్రి

 త్వరలో జాతీయ బడ్జెట్ ప్రకటించనున్న నేపథ్యంలో, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పట్టణాభివృద్ధికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుతో సహా పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.  

దీనిపై ప్రతిపాదనలు పంపిన ప్రతిసారీ కేంద్రం నుంచి నిరాశే ఎదురవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈసారైనా నిధులు ఇస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. 

కేంద్రం సహకారం నిరాకరించిన ప్రతి రంగంలో తెలంగాణ విశేష రీతిలో పురోగతి కనబర్చుతోందని, ఆ విషయాన్ని కేంద్రం ఇస్తున్న అవార్డులు, రివార్డులే చెబుతాయని కేటీఆర్ తన లేఖలో వివరించారు. పట్టణాభివృద్ధికి బీఆర్ఎస్ నిబద్ధతతో పనిచేస్తోందని, ఇకనైనా నిధులు అందిస్తారన్న నమ్మకంతో లేఖ రాస్తున్నామని తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.