కిమ్స్ కడల్స్ లో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ను ప్రారంభించిన గవర్నర్

  • చొరవను ప్రశంసించిన డాక్టర్ (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్

డెక్క‌న్ న్యూస్‌, హెల్త్ బ్యూరో: అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో, అన్ని రకాల చికిత్సలు, సేవలను అందించడంలో ముందువరుసలో ఉండాలనే తపనతో కిమ్స్ ఆస్పత్రి తెలంగాణలో మరో అరుదైన ఘనత సాధించింది. నవంబర్ 17న ‘ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే’ను పురస్కరించుకుని కొండాపూర్ లోని కిమ్స్ కడిల్స్ ఆస్పత్రిలో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ను ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ దీన్ని ఘనంగా ప్రారంభించారు. ఆసుపత్రి ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు. ఈ చొరవ నెలలు నిండకముందే జన్మించిన 400 మందికి పైగా శిశువులను కాపాడుతుంది. కిమ్స్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తల్లి పాల డిమాండ్, సరఫరాలో భారీ అంతరం వల్లే హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అవసరమైంది. అనేక వైద్యపరమైన కారణాల వల్ల చాలామంది తల్లులు నెలలు నిండకముందే పుట్టిన తమ పిల్లలకు పాలు ఇవ్వలేరు. ఇలాంటి వారికి మిల్క్ బ్యాంక్ దేవుడు పంపిన అవకాశం లాంటిది. ఇది ఈ లోపాన్ని గణనీయంగా పరిష్కరిస్తుంది.

జాతీయ స్థాయిలో చూసినా గణాంకాలు చాలా భయంగొలిపేలా ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, అకాల జననాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం 24 మిలియన్ల మంది పిల్లలు పుడతారు. వీరిలో 3.5 మిలియన్లు నెలలు నిండక ముందే జన్మిస్తున్నారు. పుట్టిన వెంటనే దాదాపు 0.76 మిలియన్ల మంది నవజాత శిశువులు మరణిస్తున్నారు. నవజాత జననాలు, మరణాలు ప్రపంచంలో ఎక్కువగా మన దేశంలోనే ఉంటున్నాయి.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముందస్తుగా, ప్రత్యేకంగా ఇచ్చే తల్లి పాలు, మదర్స్ ఓన్ మిల్క్ (ఎంఓఎం) అనేది అత్యంత ముఖ్యం. ఇది నిస్సహాయ నవజాత శిశువుల మరణాలు, అనారోగ్యాలను తగ్గిస్తుంది. బిడ్డకు సరైన శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన అన్ని ముఖ్యమైన పోషకాలు, ఎదుగుదల కారకాలు తల్లిపాలలో ఉంటాయి.

అంటువ్యాధులు, ఆహారం పడకపోవడం, నెక్రోటైజింగ్ ఎంటరోకోలైటిస్ ను తల్లి పాలు తగ్గిస్తాయి. వీటిలో ఈ లక్షణాలను తగ్గించే యాంటీ ఇన్ఫెక్టివ్ కారకాలుంటాయని నిరూపితమైంది. నవజాత శిశు మరణాలకు ఇవే ప్రధాన కారణాలు.

పిల్లల జీవితానికి అమృతప్రాయమైనా.. తల్లిపాలు అనేక కారణాల వల్ల నెలలు నిండకముందే పుట్టి, తక్కువ బరువున్న పిల్లలకు అందడం లేదు.

మంచి సంకేతం ఏమిటంటే, తల్లి పాలు అందుబాటులో లేనప్పుడు, ముఖ్యంగా నెలలు నిండకముందే పుట్టిన శిశువుకు, దాతలు అందించే పాలు ఉత్తమ ఎంపిక అని కిమ్స్ కడిల్స్ ఆస్పత్రి నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ అపర్ణ సి ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.

హైదరాబాద్ లో ఉన్న తల్లిపాల బ్యాంకులు అవసరాలకు సరిపోవని గ్రహించిన కిమ్స్ కడిల్స్.. సామాజిక బాధ్యతను తన భుజాన వేసుకోవాలని సొంతంగా తల్లిపాల బ్యాంకు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సాధారణంగా తమ ఆస్పత్రిలో పుట్టిన పిల్లలకు తల్లిపాలు అవసరమైనప్పుడు ఈ పాల బ్యాంకులను ఉపయోగించుకుంటారు. ఒకవేళ పాలు మిగిలితే, ఒక నోడల్ ఏజెన్సీ ద్వారా ఇతర ఆస్పత్రులకూ పంపుతారు.

“నెలలు నిండకముందే పుట్టి, బాగా తక్కువ బరువున్న పిల్లలకు నూటికి నూరుశాతం తల్లిపాలు అందించాలన్న ఉద్దేశంతో కిమ్స్ కడిల్స్ ఈ బ్యాంకును ఏర్పాటుచేసింది. మా నియమావళిలో భాగంగా, శిక్షణ పొందిన మా సిబ్బంది దాతలుగా ముందుకొచ్చే తల్లులను స్క్రీనింగ్ చేస్తారు. వారికి తగిన విధంగా కౌన్సెలింగ్ ఇస్తారు. అంటువ్యాధులున్నాయేమోనని పరీక్షిస్తారు. పాలను సేకరించి, పాశ్చరైజ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసి, బాగా అవసరంలో ఉన్న శిశువులకు ఆ పాలు పంపిణీ చేస్తారు” అని ఆమె వివరించారు.

“కిమ్స్ కడిల్స్ లోని మా నియోనాటల్ యూనిట్ ప్రతి నెలా దాదాపు 150 మంది నవజాత శిశువులకు సేవలందిస్తుంది. ఇందులో ఇక్కడే పుట్టినవారు, వేరేచోట పుట్టినవారూ ఉంటారు. ఈ అడ్మిషన్లలో 20-25% వరకు 34 వారాల గర్భధారణ కంటే ముందే పుట్టిన.. నెలలు నిండని నవజాత శిశువులు అని అంచనా. ఇలాంటివారికి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. చాలామంది అనారోగ్యంతో ఉన్నవారు, నెలలు నిండకముందే పుట్టినవారు కావడంతో వాళ్లకు తొలి వారంలో తల్లిపాలు అందవు. అలాంటివారికి తల్లిపాల బ్యాంకులు ఒక వరం” అని ఆమె అన్నారు.

అనేక మంది అర్హులైన తల్లులు స్వచ్ఛందంగా పాలు దానం చేయడానికి సుముఖత చూపడం మంచి పరిణామం. ఈ బ్యాంకుల్లో పాలను ఒక సంవత్సరం వరకు నిల్వ చేయవచ్చు. అవసరమైనప్పుడు పాలను తీసి, ద్రవ స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఉపయోగిస్తారు.

ఏ రోజైనా సగటున తమ తల్లిపాల బ్యాంకు నుంచి కనీసం ఐదుగురు శిశువులకు పాలు అవసరం అవుతాయని కిమ్స్ కడిల్స్ భావిస్తోంది.

తల్లిపాల బ్యాంకులను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గుతాయని, ఎన్ఈసి 65% తక్కువ అవుతుందని, మరణాల రేటు కూడా దాదాపు సగం తగ్గిందని డాక్టర్ అపర్ణ సి చెప్పారు.

పాల దాతల ఉదాత్తత

ఆరోగ్యంగా ఉండి, పాలిచ్చే తల్లులు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. దాతలుగా ముందుకు రావాలని ఆసుపత్రి ఎవరినీ బలవంతం చేయదు. అలా ఇచ్చేవారికి బదులుగా ఏదైనా ఇస్తామని వాగ్దానం కూడా చేయదు.

అనేక సందర్భాల్లో తమ పాలు దానం చేసేందుకు ముందుకొచ్చిన ముగ్గురు ఆరోగ్యవంతులైన తల్లులను ఈ వేడుకల సందర్భంగా సన్మానించారు. ఈ ముగ్గురు తల్లులు శ్రీమతి మాధురి, శ్రీమతి రూప, శ్రీమతి అనూష. వీరి సగటు విరాళాలు 15 లీటర్లు. నిజంగా ఇది ఒక అద్భుతమైన సహకారం.

“చాలా మంది తల్లులు తమ బిడ్డలకు అవసరమైన దానికంటే ఎక్కువ పాలు తమకు వస్తున్నాయని చెప్పి మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వారి సహాయం చాలా మంది నెలలు నిండక ముందే ఉన్న శిశువులను ఎలా కాపాడుతుందనేదాని గురించి వారికి కౌన్సెలింగ్, ప్రేరణ ఇస్తాం. పాలు దానం చేయాలని మేము వారిపై ఒత్తిడి చేయం. ఇది స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలి” అని డాక్టర్ అపర్ణ నొక్కి చెప్పారు.

ఈ ఉదాత్తమైన తల్లులందరికీ వారి మానవీయతకు కిమ్స్ కడిల్స్ సెల్యూట్ చేస్తుంది.