జ‌న‌సేన ఓ సెల‌బ్రిటి పార్టీ

త‌న‌ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బొత్స తెలిపారు. అసలు జనసేన ఓ రాజకీయ పార్టీ కాదన్న బొత్స…అదో సెలబ్రిటీ పార్టీ అని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని… అయితే పవన్ వ్యాఖ్యలు మాత్రం ఆ హద్దులను దాటేశాయన్నారు.

మంత్రులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవద్దా? అని బొత్స ప్రశ్నించారు. విశాఖలో పవన్ కల్యాణ్ తన సభను తానే రద్దు చేసుకుంటే.. అది తమ తప్పా అని కూడా ఆయన నిలదీశారు. ఊరేగింపు లేకుండా సభ నిర్వహించుకోవాలని పోలీసులు పవన్ కు సూచించారన్నారు. ర్యాలీ చేసేందుకు పవన్ అనుమతి తీసుకుని ఉంటే పోలీసులు రూట్ మ్యాప్ ఇచ్చేవారన్నారు. వపన్ విశాఖ వచ్చిన రోజు తానే ట్రాఫిక్ లో గంటన్నర పాటు చిక్కుకుపోయానని బొత్స అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునన్న బొత్స.. ఈ విషయంలో పవన్ సలహాలు తమకేమీ అవసరం లేదన్నారు.