గూలంన‌బీ పార్టీ ప్ర‌క‌ట‌న నేడే

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకుని ఇటీవల బయటకు వచ్చిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేడు సొంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో నేడు తన పార్టీ తొలి యూనిట్‌ను ప్రకటిస్తారు. 73 ఏళ్ల ఆజాద్ నేటి ఉదయం 11 గంటలకు జమ్మూ చేరుకుంటారు. విమానాశ్రయంలో మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి సైనిక్ ఫామ్స్‌కు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఈ ర్యాలీకి 20 వేల మంది వరకు హాజరవుతారని అంచనా. అక్కడే ఆయన తన జాతీయ స్థాయి పార్టీని ప్రకటిస్తారు. కాగా, ఆజాద్‌కు మద్దతుగా జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ యూనిట్‌లోని పలువురు నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ ఎమ్మెల్యే అశోక్ శర్మ నిన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు లేఖ రాస్తూ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఆయన కూడా త్వరలోనే ఆజాద్ గూటికి చేరుతారని తెలుస్తోంది.