నేడే ఏపీ మంత్రిమండలి చివ‌రి స‌మావేశం

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రిమండలి నేడు చివరిసారి సమావేశం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు వెలగపూడిలో జరగనున్న ఈ సమావేశంలో 25 మంది మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. వారి స్థానంలో ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.

అయితే, రాజీనామా చేసే 25 మంది స్థానంలో పూర్తిగా కొత్త వారినే తీసుకుంటారా? లేదంటే, పాతవారిలోనూ కొందరికి మంత్రి పదవులు మార్చి ఇచ్చే అవకాశం ఉందా? అన్న విషయం తెలియరాలేదు. అయితే, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు, లేదంటే నలుగురిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.