క‌రోనాతో శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ మ‌ర‌ణం

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ మాస్ట‌ర్ క‌రోనాతో పోరాడుతూ మ‌ర‌ణించారు. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. గ‌త కొన్ని రోజుల‌గా క‌రోనా బారిన ప‌డి హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు వచ్చాయి. తమిళ హీరో ధనుష్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వంటివారు శివశంకర్ మాస్టర్ చికిత్స కోసం విరాళాలు కూడా అందజేశారు. అటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా శివశంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే అందరినీ విషాదానికి గురిచేస్తూ శివశంకర్ మాస్టర్ నేడు తుదిశ్వాస విడిచారు. అందరితోనూ సఖ్యతతో మెలిగే శివశంకర్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. అటు శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శివశంకర్ మాస్టర్ వయసు 72 సంవత్సరాలు. 1975 నుంచి ఆయన సినీ రంగంలో కొనసాగుతున్నారు. 10 భాషల్లో 800కి పైగా చిత్రాల్లో పాటలకు కొరియోగ్రఫీ అందించారు. నటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో కనిపించారు. టెలివిజన్ రంగంలోనూ ప్రేక్షకులను అలరించారు.