డెక్కన్‌‌ చార్జర్స్‌‌కు రూ. 4800 కోట్లు చెల్లించండి

ఐపీఎల్‌‌ నుంచి టర్మినేట్‌‌ చేసిన డెక్కన్‌‌ చార్జర్స్‌‌ (డీసీ) ఫ్రాంచైజీకి రూ. 4800 కోట్లు పరిహారంగా చెల్లించాలని బాంబే హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్‌‌ శుక్రవారం బీసీసీఐని ఆదేశించారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ సీకే టక్కర్‌‌.. ఐపీఎల్‌‌ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌ను డీసీ ఉల్లంఘించలేదని తేల్చారు. లీగ్‌‌ నుంచి ఫ్రాంచైజీని తొలగించడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్ల పాటు సాగిన ఈ విచారణలో.. తుది వాదనలను ఠక్కర్‌‌ వర్చువల్‌‌గా చేపట్టారు. తీర్పును మాత్రం ఓరల్‌‌గా చదివి వినిపించారు. 2017లో డీసీహెచ్‌‌ఎల్‌‌కు వ్యతిరేకంగా ఇన్‌‌సాల్వెన్సీ (దివాలా) ప్రొసీడింగ్స్‌‌ చేపట్టడంతో మధ్యలో ఈ కేసును రెండేళ్లు పెండింగ్‌‌ పెట్టారు. డీసీ తరఫున దిర్‌‌ అండ్‌‌ దిర్‌‌ లా ఫర్మ్‌‌ వాదనలు వినిపించగా, విరాజ్‌‌ మనియార్‌‌ బీసీసీఐ తరఫున వాదనలు వినిపించారు. డబ్బులు చెల్లించేందుకు బీసీసీఐకి సెప్టెంబర్‌‌ ఎండ్‌‌ వరకు గడువు ఇచ్చారని డీసీ తరఫు న్యాయవాది వెల్లడించారు. బోర్డు చట్ట విరుద్ధంగా చర్యలు చేపట్టిందన్నారు. నోటీసు పిరియడ్‌‌ ముగియకముందే ఫ్రాంచైజీని టెర్మినేట్‌‌ చేశారని, ఇదంతా కేవలం ఒక్క రోజులోనే జరిగిందని డీసీహెచ్‌‌ఎల్‌‌ సీనియర్‌‌ కౌన్సెల్‌‌ హరేశ్‌‌ జగ్తియాని అన్నారు. మరోవైపు తాము తీర్పు కాపీ కోసం వేచి చూస్తున్నామని, అది వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని బీసీసీఐ లాయర్‌‌ తెలిపారు.
ఇదీ కేసు..
ఐపీఎల్‌‌ ప్రారంభించినప్పుడు ఉన్న ఫ్రాంచైజీల్లో డెక్కన్‌‌ క్రానికల్‌‌ హోల్డింగ్‌‌ లిమిటెడ్‌‌ (డీసీహెచ్‌‌ఎల్‌‌)కు చెందిన డెక్కన్‌‌ చార్జర్స్‌‌ కూడా ఒకటి. స్టార్టింగ్‌‌లో ఆడమ్‌‌ గిల్‌‌క్రిస్ట్‌‌ నేతృత్వంలోని చార్జర్స్‌‌ టీమ్‌‌ 2009లో టైటిల్‌‌ను కూడా గెలిచింది. అయితే తమ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ బీసీసీఐ 2012లో డీసీపై వేటు వేసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఫ్రాంచైజీని వేలం వేయాలని యాజమాన్యం ప్రయత్నించినా బోర్డు దానిని అడ్డుకుంది. ఫ్రాంచైజీ ఫైనాన్షియల్‌‌ స్టేటస్‌‌ బాగా లేదని ఆరోపించిన బీసీసీఐ ప్లేయర్లను వేలంలో పెట్టింది. ఈ మొత్తం వ్యవహారంపై చార్జర్స్‌‌.. బాంబే హైకోర్టును ఆశ్రయించగా, 2012 సెప్టెంబర్‌‌లో ఆర్బిట్రేటర్‌‌ను ఏర్పాటు చేసింది. అలాగే 10 రోజుల్లో రూ. 100 కోట్ల బ్యాంక్‌‌ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించింది.