తెలంగాణలో 1500 పైన కేసుల

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1500 దాటింది. ఇవాళ కొత్తగా 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 1, మరో 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 52 మంది వలస కార్మికులు కరోనాబారిన పడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,509కు చేరింది. ఇవాళ కరోనా మహమ్మారి నుంచి 12 మంది కోలుకోగా.. మొత్తం 971 మంది బాధితులు డిశ్చార్జ్‌ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా.. 504 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు  ప్రకటించింది.