డిమాండ్ కి తగిన పంటలు వేయాలి

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తేవాలని కేసీఆర్ కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్సు ద్వారా క్లస్టర్ల ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో తాను మాట్లాడనున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, అధికారులు జనార్థన్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
‘‘రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం రూపొందాలి. దానికి అనుగుణంగానే ప్రతీదీ జరగాలి. రైతులు ఏ పంటలు వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలి. తెలంగాణ ప్రజల ఆహార అవసరాలు, ఇతర ప్రాంతాల్లో డిమాండుకు తగిన పంటలు వేసేలా ప్రణాళిక తయారు చేయాలి. ప్రత్యామ్నాయ పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. దాని ప్రకారమే సాగు జరగాలి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘వ్యవసాయ శాఖ ఇన్వెంటరీ తయారు కావాలి. వ్యవసాయ శాఖకున్న ఆస్తులు, భవనాలు ఇతరత్రా వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. రికార్డు చేయాలి. గ్రామాల్లో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలి. ఇంకా రైతులకు ఏమి కావాలో గుర్తించాలి. దానికి అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేయాలి. రైతుల నుంచి వివరాలు సేకరించాలి. ఖచ్చితమైన వివరాలతో ఫార్మాట్ ద్వారా సమాచారం సేకరించాలి. త్వరలోనే నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చిస్తాను’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.