మాస్కులు ధరించకుండా బయటికి వస్తే సీసీ కెమెరాలు పట్టేస్తాయ్‌!

ముఖానికి మాస్కులు లేకుండా బయట తిరిగే వాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మాస్కులు పెట్టుకోని వాళ్లను కృత్రిమ మేథను ఉపయోగించి సీసీ కెమెరాల ద్వారా గుర్తిస్తామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. దేశంలోని తొలిసారి రాష్ట్ర పోలీసుల ఈ తరహా సాంకేతిక పరిజ్ఞనాన్ని ఉపయోగించుకొని వినూత్న ప్రయోగం చేయబోతున్నారని డీజీపీ తెలిపారు. త్వరలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తామని డీజీపీ తెలిపారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మాస్కులను ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ మాస్కులు ధరించకుండా బయటికి వస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధించేలా ఆదేశాలు జారీ చేసింది. మాస్కులు ధరించకుండా బయటికి వచ్చే వాళ్లను గుర్తించే పనిలో పోలీస్ శాఖ నిమగ్నమైంది.