కోవిడ్-19 సృష్టించిన సంక్షోభంలో నిరుపేదల పట్ల ఉదారత చూపాలి

కోవిడ్-19 ను అరికట్టే, నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్క్ ఫ్రం హోమ్, సోషల్ డిస్టెన్సింగ్ లను ప్రతిపాదించడమూ; ప్రజలూ, సంస్థలూ వీటిని సీరియస్ గానే పాటించడమూ ముదావహం. అయితే, రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు, దినసరి కూలీలకు ఇంట్లో ఉండిపోయే పరిస్థితి ఉండదు. వీరికొరకు నిన్న ప్రభుత్వం ప్రకటించిన 12 కేజీల బియ్యం, రూ. 1500 నగదును స్వాగతిస్తున్నాం. అయితే సమస్య ఇక్కడితో తీరిపోదు.

  1. పాలు, కూరగాయలు, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్ అన్నింటి ధరలూ అమాంతం పెంచేసిన్రు వ్యాపారులు – సరుకులు రావడం లేదు అనే సాకుతో. దీనిని వెంటనే నియంత్రించాలి.
  2. సరుకుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలి. కృత్రిమ కొరత సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  3. తెల్ల రేషన్ కార్డు లేని పేదలు చాలామంది వున్నారు, వారికి కూడా ప్రభుత్వ సహాయం అందాలి. మన రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పనిచేస్తున్న, తెల్ల రేషన్ కార్డులు లేని దినసరి కూలీలు, కార్మికులందరికి 12 కేజీల బియ్యం, రూ. 1500 నగదును ఇవ్వాలి.
  4. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు అందించే ఏర్పాట్లు చేయాలి. బియ్యంతో పాటు వంటనూనె, పప్పుదినుసులు కూడా అందివ్వాలి. ప్రభుత్వరంగ సంస్థ విజయా డెయిరీ ద్వారా పాలను కూడా అందించాలి.
  5. వైరస్ వ్యాప్తిని అరికట్టడమూ, సరుకుల పంపిణీలో ఆలస్యాన్ని, సాంకేతిక ఇబ్బందులనూ నివారించేందుకు ప్రస్తుతానికి బయోమెట్రిక్ విధానాన్ని ఆపివేయాలి.
  6. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న quarantine కేంద్రాల్లో కనీస వసతులు లేవనే ఫిర్యాదులు మీడియాలో చూస్తున్నాం. ఈ పరిస్థితిని సరిచేయాలి. అవసరమైనంత సిబ్బందిని, పరికరాలను, మాస్కులు, సానిటైజర్లు, శుభ్రమైన పడకలను సిద్దంగా ఉంచాలి.
  7. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి. అవసరమైన చోట మొబైల్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగలిగే వసతులు జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులలో ఉండాలి. అదే విధంగా అత్యవసరమైన కేసులకు ఐసియు సౌకర్యం కల్పించాలి. కావలసిన మందులను సరఫరా చేయాలి.
    8 . ఎక్కడా డ్యూటీలో లేని వైద్యుల సేవలను ఉపయోగించాలి.

మన దేశంలో సామాజిక, ఆర్ధిక అసమానతల వల్ల ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను పొందడం కూడా నిరక్షరాస్యులు, నిరుపేదలకు కష్టం అవుతుంది. ఇది ఎప్పుడూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితి. ప్రభుత్వాలు, ప్రజాసంఘాలు, ఉద్యమ వేదికలు అనాదిగా కృషి చేస్తూనే ఉన్నా అసమానతల నిర్మూలన మనం ఇప్పటికీ సాధించలేకపోయినాము. ఇదొక నిరంతర ప్రక్రియ అనే అవగాహన మాకు ఉన్నప్పటికీ, ప్రస్తుత సంక్షుభిత, ప్రమాదకర పరిస్థితుల దృష్య్టా ప్రభుత్వం నిస్సహాయ ప్రజలపైన మానవీయ దృక్పథంతో ఉండాలని, పై చర్యలు తీసుకోవడంలో చొరవా, సహానుభూతీ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రొఫెసర్ కోదండరాం
తెలంగాణ జన సమితి
ఎల్. రమణ
అధ్యక్షులు, తెలంగాణ తెలుగు దేశం పార్టీ.
చాడ వెంకట్ రెడ్డి
కార్యదర్శి, సి.పి.ఐ
తమ్మినేని వీరభద్రం,
కార్యదర్శి, సి.పి.ఎం.
డాక్టర్. చెరుకు సుధాకర్
పోటు రంగా రావు,
సిపిఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ
గోవర్ధన్
సిపిఐ(ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ

Sent from my iPad