ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌పై ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్​రాజ్ కు కాంగ్రెస్​ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్​రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 20న మునుగోడు నియోజకవర్గం చండూర్​ మండలం దోనిపాముల గ్రామంలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ దోనిపాముల గ్రామానికి రూ. 2 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని ప్రకటించారన్నారు.

సొంత నియోజకవర్గం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే పట్టించుకోకుండా వేరే నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేయడమే కాకుండా ఇక్కడి నిధులను మళ్లిస్తామని చెప్పడం సరికాదన్నారు. తప్పుడు హామీలతో దోనిపాముల ప్రజలను మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేస్తున్న ఎమ్మెల్యే రసమయిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.