మ‌హిళా గ‌వ‌ర్న‌ర్‌ని అవమానా ప‌రుస్తారా : కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన

తెలంగాణ రాష్ట్ర మ‌హిళా గ‌వ‌ర్న‌ర్‌పై ట్విట్ట‌ర్‌లో ఎలా అవ‌మాన ప‌రుస్తార‌ని మండిప‌డ్డారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్రసూన‌. ఇటీవ‌ల తెలంగాణ జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకొని మ‌హిళా గ‌వర్న‌ర్ అని కూడా చూడ‌కుండా అవ‌మాప‌రిచేలా చేస్తున్న చ‌ర్య‌లు స‌రికాద‌న్నారు. ఈ మేర‌కు పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి బంజ‌రాహిల్స్ పోలీస్‌స్టేష‌న్ ఫిర్యాదు చేశారు ఆమె.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రధమ పౌరురాలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను అవమానిస్తూ కొందరు సోషల్‌ మీడియాలో ఆమెపై అభ్యంతరక పోస్టులు పెడుతున్నారు. ఆమె ఫోటోపై ఎర్రటి తిలకం దిద్ది అవమానిస్తూ అనేక రకాల కామెంట్లు పెడుతూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ విధంగా మహిళ అనే గౌరవం లేకుండా ఉన్నత పదవిలో ఉన్న మహిళను అవమానిస్తూ పోస్టులు పెడుతుంటే ఇక రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు.
మన దేశంలో మహిళను దేవతల మాదిరిగా పూజిస్తుంటారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని నానుడి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. కానీ ఏ తప్పు చేయకుండానే రాష్ట్ర గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వమే కక్షకట్టి ప్రోటోకాల్‌ పాటించకుండా, ఆమె కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులెవరూ హాజరు కాకుండా అవమానిస్తున్నారు. ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులే గవర్నర్‌ను అవమానిస్తుంటే వారిని అనుసరిస్తూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైతం ట్విట్టర్‌లో ఆమెను అవమానిస్తున్నారు. షీ-టీమ్‌లు పెట్టి మహిళలను వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ రాష్ట్ర గవర్నర్‌ను అవమానిస్తున్న వారిపై షీ-టీమ్‌ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు ఎవరిని వేధించినా, వారి వేధింపులకు గురై రాష్ట్రంలో ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదు. కనుక టీఆర్‌ఎస్‌ నాయకులు రెచ్చిపోయి సామాన్యులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చట్టానికి అతీతులని ప్రభుత్వం చెబుతున్నదా..? వారు ఎన్ని దుర్మార్గాలైనా చేయవచ్చునని పోలీసులు వారికి లైసెన్సులేమైనా ఇచ్చారా?
ఇప్పటికైనా గవర్నర్‌ను అవమానిస్తున్నవారిపై సైబర్‌క్రైం కింద కేసులుపెట్టి తక్షణం అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున పోలీసులను డిమాండ్‌ చేస్తున్నాం. ఎవరు తప్పు చేసినా పార్టీలకతీతంగా వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.