27న తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు

ఈనెల 27న జరుగనున్న 18వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన ఈ సారి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు నిర్వహిస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా ఈ జండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు