స‌చివాల‌యంలో అన్ని సౌక‌ర్యాలుండాలి : కేసీఆర్‌

నూతన సచివాలయంలో అందరికీ అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలుండేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయ భవనం నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కొత్త సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లలో కూడా అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పారు. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్‌ హాలు, మీటింగ్‌ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాలు ఉండాలని, పార్కింగ్‌ ప్రదేశంలో అన్ని రకాల వాహనాలను నిలిపే సౌకర్యం ఉండాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నర్సింగ్‌రావు, సీఎంవో అధికారులు స్మితాసబర్వాల్‌, భూపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, అధికారులు సతీశ్‌, మధుసూదన్‌రెడ్డి, సలహాదారు సుద్దాల అశోక్‌తేజ, అర్కిటెక్ట్స్‌ నిపుణులు ఆస్కార్‌-పొన్ని తదితరులు పాల్గొన్నారు.