ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ప్రకటిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల క్రితం ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణను నియమించిన హైకమాండ్‌ ఆయన్ను తొలగించింది. తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించినప్పటి నుంచే ఏపీకి కూడా కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరిగినా ఇన్నిరోజుల పాటు నాన్చుతూ వచ్చారు. చివరికి పార్టీకి వీర విధేయుడైన సోము వీర్రాజు పేరును ఖరారు చేస్తూ సోమవారం రాత్రి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజులుగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న హైకమాండ్ పలువురి పేర్లు పరిగణనలోకి తీసుకొని చివరికి సోము వీర్రాజు వైపునకు మొగ్గు చూపింది. సోము వీర్రాజుకు పార్టీలో ప్రమోషన్ రావడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని, ఎన్నికల వరకు రాష్ట్రంలో పార్టీని గాడిలో పెడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.