కేసీఆర్ వాడుకొని వ‌దిలించుకుంటాడు: స‌ంప‌త్ కుమార్‌

టీఆర్ఎస్ మంత్రులు కల్వకుంట్ల కుటుంబ సేవ‌లో ఉంటే అధోగతి పాల‌వుతార‌ని, చరిత్ర తెలుసుకొని మెలగాల‌ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. కొంతమంది మంత్రులు ఇటీవల విర్రవీగి, విచ్చలవిడిగా మాట్లాడుతున్నార‌ని, అలాంటి వారిని క‌ల్వ‌కుంట్ల కుటుంబం వాడుకొని వదిలేస్తుంది జాగ్రత్త అని సూచించారు. కోదండరాం నుంచి హరీష్ రావు వరకు అనేకమందిని వాడుకొని వదిలేశారని, వారికి సేవ చేసిన ఎంతో మంది నాయకులు అడ్రెస్ లేకుండా పోయారని చెప్పారు. ఆదిలాబాద్‌లో జోగు రామన్న, ఖమ్మంలో తుమ్మల, హైద‌రాబాద్ లో నాయిని, మహబూబ్ నగర్ లో లక్ష్మారెడ్డి, జూపల్లి, వరంగల్‌లో కడియం, చందూలాల్ ఇలా అనేకమందిని మోసం చేసిన చరిత్ర కల్వకుంట్ల వారిదని ఆయ‌న అన్నారు. బీసీ నాయకులుగా ఉన్న మధుసూదన్ చారి, స్వామి గౌడ్ ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాల‌ని, రేపు మీకు కూడా ఇదే గతి ప‌డుతుంద‌ని అన్నారు.