ఎరుపు రంగు పూలతో పూజించి, చిమ్మిలి దానం ఇస్తే..

మాఘమాసం అనేక విశిష్టతలతో కూడుకున్నది. ఈ మాసం శివ, విష్ణు, గణేశ, శక్తి, సూర్యోపాసనలకు ఎంతో అనుకూలమైనది. చంద్రుడు మఘ నక్షత్రంతో కూడుకుని ఉంటాడు కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది.
హిందూ క్యాలెండర్‌లోని ఒక్కో నెలకు ఒక్కో రకమైన ప్రాశస్త్యం ఉంది. అందునా సూర్యారాధనకు ప్రధానమైదిగా చెప్పుకునే మాఘమాసం శివ, విష్ణు, గణేశ, శక్తోపాసనలకు సైతం ఎంతో అనుకూలమైనది. శివ, సూర్యోపాసనలకు ద్విగుణీకృతఫలదాయకమిది. ఈ మాసంలో చంద్రుడు మఘ నక్షత్రంతో కూడుకుని ఉంటాడు కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది. ఈ మాసమంతా సూర్యోపాసనకు అనుకూలమైనదే అయినా, ఈ నెలలోని ఆదివారాలు, రథసప్తమినాడు విశేషార్చన చేయవచ్చు. మాఘపాదివారాలలో సూర్యవ్రతం చేయడం ఎంతో విశిష్టతతో కూడుకున్నదైనా, రథ సప్తమి ఇంకా ప్రశస్తమైనది. దీనికి కారణం ఇప్పటి బ్రహ్మకల్పాదిలో అంటే నేటికి సుమారు నూటతొంభై ఏడు కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు ఏకచక్రరథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయన అధిరోహించిన రథం కాల చక్రమని తాత్త్విక వ్యాఖ్యానం. అందుకని ఈరోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది. రథ సప్తమి నాడు తప్పక చేయవలసిన విధులు స్నానం, సూర్యార్చనం. సూర్యోదయానికి ముందే సమీపాన ఉన్న నదులు, తీర్థాలు, చెరువులలో కానీ, ఇవేవీ లేకపోతే బావి నీళ్లతో కానీ స్నానం చేయాలి.
‘సుపుణ్యేస్మిన్‌ మాఘమాసే స్నామ్యహం దేవ మాధవ, దు:ఖదారిద్య్ర నాశాయ శ్రీవిష్ణోస్తోషణాయ చ, ప్రాత:స్నానం కరోమ్యద్య మాఘే పాప ప్రణాశనమ్‌, మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత! కేశవ దివాకర జగన్నాథ! ప్రభాకర! నమోస్తు తే పరిపూర్ణం కురుష్వేదం మాఘస్నానం మహావ్రతమ్‌’అని భక్తితో సూర్యుడు, గోవిందుని స్మరించుకుంటూ స్నానం చేయాలి. ఇది మాఘమాస నిత్య స్నానవిధి. రథసప్తమి నాడు గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్యమైనది. శిరస్సున జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను ఉంచుకుని స్నానజలాలలో శాలిధాన్యం, నువ్వులు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. అలాగే‘యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ!’అనే శ్లోకాన్ని మూడు సార్లు ఉచ్చరించాలి. ఇలా స్నానం చేస్తే సూర్యగ్రహణ స్నానఫలం, గంగా స్నానఫలం కలుగుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మాఘశుద్ద సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని, ఆ రోజునే ఆయన పుట్టిన తిథిగా పేర్కొంటారు. అందుకు దీనికి రథసప్తమి అనే పేరు వచ్చిందని పురాతన కాలం నుంచి భారతీయులు భావిస్తారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చెయ్యడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చెయ్యాలి. పురుషులు ఏడు జిల్లేడు ఆకులు, మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి.

జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే

“సప్తాశ్యముల గల ఓ సప్తమీ! నీవు సకల భూతాలకు, లోకాలకు జననివి. సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం. అని ఈ మంత్రం అర్థం. రథ సప్తమినాడు ఆవు నెతితో దీపారాధన చెయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి పిడకలు అంటించి, పాలు పొంగించి, ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయి.