రైల్వే ప్రయాణికులకు శుభవార్త
రేపటి నుంచి బుకింగ్‌లు

కరోనా వైరస్‌ కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా లాక్‌డౌన్‌ మూడోసారి మే 17వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తోంది. ఇప్పటికే వలస కూలీలను శ్రామిక్‌ రైళ్ల ద్వారా వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది. తాజాగా మే 12వ తేదీ నుంచి దశల వారీగా పాసింజర్‌ రైళ్లను కూడా నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా దేశంలోని 15 ముఖ్య నగరాలకు నడపనున్నారు.

దిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు(15 రైళ్లు) అక్కడి నుంచి నుంచి దిల్లీకి(15 రైళ్లు) మొత్తం 30 రైళ్లను నడపాలని నిర్ణయించారు. దిల్లీ నుంచి దిబ్రూఘర్‌, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్‌పూర్‌, రాంచీ, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్‌, ముంబయి సెంట్రల్‌, అహ్మదాబాద్‌, జమ్మూతావిలకు అక్కడి నుంచి దిల్లీకి ఈ రైళ్లు తిరగనున్నాయి. దీని తర్వాత రైల్వే కోచ్‌లు అందుబాటులో ఉన్న దానిని బట్టి ప్రత్యేక రైళ్లు నడిపే విషయమై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20వేల కోచ్‌లను కొవిడ్‌-19 కేర్‌ సెంటర్లుగా మార్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రోజూ 300 శ్రామిక్‌ రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది.