చికిత్స కోసం ద‌క్షిణ కొరియాకు సమంత‌

అరుదైన కండరాల రుగ్మత..’మయోసైటిస్’ తో బాధపడుతున్న ప్రముఖ నటి సమంత మెరుగైన చికిత్స కోసం దక్షిణ కొరియాకు వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధికి ఆమె ఇప్పటివరకు ఆయుర్వేద చికిత్స తీసుకున్నప్పటికీ.. మరింత మంచి ఫలితాల కోసం సౌత్ కొరియాకు వెళ్తున్నట్టు ‘ఇండియా గ్లిట్జ్’ తెలిపింది చిక‌త్స తీసుకునేందుకు ఆ దేశంలో కొన్ని నెలల పాటు ఉండవచ్చునని తెలుస్తోంది. అక్కడ పూర్తిగా చికిత్స పొంది తిరిగి వచ్చాక హీరో విజయ్ దేవరకొండతో కలిసి తాను నటించే మూవీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టవచ్చునంటున్నారు.

అయితే ఆమె సౌత్ కొరియా విజిట్ పై ఆమె నుంచి గానీ, ఆమె టీమ్ నుంచి గానీ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. విపరీతమైన అలసట, నీరసం, వంటి రుగ్మతలతో కూడిన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సమంతా రూథ్ ప్రభు గత అక్టోబరులో వెల్లడించింది. ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతున్న ఫోటోను కూడా ఆమె తన ట్వీట్ కి జోడించింది.

‘యశోద’ చిత్రంలో నటించిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత దిగజారిందని, దీంతో కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకోవలసిందిగా డాక్టర్లు ఆమెకు సూచించారని సమాచారం. మయోసైటిస్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ కండరాల బలహీనత తనను బాధ పెడుతోందని ఆమె ఇటీవల తెలిపింది. దీంతో సహజంగానే ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. సమంత అప్పుడే దక్షిణ కొరియాకు బయల్దేరిందని కూడా ఓ వర్గం మీడియా పేర్కొంది.