గ‌వ‌ర్న‌ర్‌తో ష‌ర్మిల భేటీ అందుకేనా ?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి సమావేశం కానున్నారు. పాదయాత్రలో తమ బస్సుపై దాడి ఘటన, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరును గవర్నర్‌కు షర్మిల వివరించనున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

కాగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై, తన కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ శ్రేణులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్తున్న వైఎస్‌ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. పంజాగుట్టలో ఆమె కారును అడ్డుకున్నారు. డోర్‌ లాక్‌ చేసుకుని షర్మిల కారు లోపలే ఉన్నారు. దీంతో కొద్దిసేపటి తర్వాత కారును క్రేన్‌తోనే లిఫ్ట్‌ చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారులో నలుగురు వ్యక్తులు ఉండగానే లాక్కెళ్లారు. ఆ తర్వాత పీఎస్‌ వద్ద బలవంతంగా కారు డోర్లు తెరిచి షర్మిలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ విష‌యంపై గ‌వ‌ర్న‌ర్ కూడా స్పందించడం.. త‌ర్వాత భేటీ కావ‌డం అనే అంశం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.