తెరాస ఎమ్మెల్యేను విచారిస్తున్న ఈడీ

డెక్క‌న్ న్యూస్‌, హైద‌రాబాద్ బ్యూరో:
ఫెమా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో విచార‌ణ‌కు పిలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడీ నోటీసుల‌తో మంగ‌ళవారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో మంచిరెడ్డి ఈడీ కార్యాల‌యానికి చేరుకోగా… రాత్రి 9 గంట‌లు దాటినా… అధికారులు ఆయ‌న‌ను విచారిస్తూనే ఉన్నారు. ఈ విచార‌ణ ఎప్ప‌టికి ముగుస్తుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఓ కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఓ వ్య‌క్తిని ఈడీ అధికారులు విచారించ‌గా…మంచిరెడ్డి లావాదేవీల‌కు సంబంధించిన ప‌లు వివరాలు ఈడీకి తెలిశాయి. అతి స్వ‌ల్ప‌కాలంలోనే మంచిరెడ్డి దాదాపుగా రూ.88 కోట్ల‌కు పైగా లావాదేవీలు నెర‌పార‌ట‌. అది కూడా శ్రీలంక‌, బంగ్లాదేశ్, థాయ్‌ల్యాండ్ త‌దిత‌ర దేశాల్లో ఆయ‌న ఈ లావాదేవీలు జ‌రిపిన‌ట్లుగా ఈడీ అధికారులు నిర్ధారించారు. ఈ దేశాల్లోని క్యాసినో, గోల్డ్ మైన్ల‌లో మంచిరెడ్డి పెట్టుబ‌డి పెట్టిన‌ట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ క్ర‌మంలో మ‌రింత మేర ఆధారాలు సేక‌రించే దిశ‌గా ఈడీ అధికారులు విచార‌ణ‌ను సాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంచిరెడ్డి వాట్సాప్ సందేశాల‌ను ఈడీ అధికారులు రిట్రీవ్ చేసిన‌ట్టుగా స‌మాచారం. ఈ స‌మాచారం ఆధారంగా మంచిరెడ్డిని విచారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.