వినికిడి యంత్రాలు ఇప్పుడు న్యూర‌లాజిక‌ల్ ఎమ‌ర్జెన్సీగా మారాయి : డా. జ‌నార్ధ‌న‌రావు

భార‌త‌దేశంలో పుట్టిన ప్ర‌తి వెయ్యిమంది పిల్ల‌ల్లో ఇద్ద‌రు లేదా ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్న‌ప్పుడు లేదా బాల్యంలో ఇంకా ఎక్కువ మంది తమ వినికిడిని కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్ల‌లోనే మాట్లాడ‌టం, భాష అభివృద్ధి చెంద‌డం లాంటివి జ‌రుగుతాయి. మాట‌ల‌ను అర్థం చేసుకోవడానికి అవసరమైన నాడీ మార్గాలను ఆ స‌మ‌యంలోనే మెదడు నిర్మిస్తుందని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ ఈఎన్‌టీ నిపుణుడు, ఆ విభాగాధిప‌తి డాక్ట‌ర్ జ‌గిని జ‌నార్ధ‌న‌రావు చెప్పారు. మార్చి 3వ తేదీ ప్ర‌పంచ వినికిడి దినోత్స‌వంగా చేసుకుంటారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య ఎందుకు వ‌స్తుంది, దాని ప‌రిష్కారం ఏంట‌నే వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు.

“వినికిడి అనేది మెదడు పనితీరు. ధ్వనిని ఆమోదించి, దాన్ని ప్రాసెస్ చేయడానికి పిల్ల‌ల మెదడు “ముందస్తుగా వైర్ చేసి ఉంటుంది”. వినికిడి సామ‌ర్థ్యం సాధారణంగానే ఉన్న పిల్లలు 20 వారాల గర్భధారణ సమయంలో, పుట్టుకకు ముందు నుంచే వినడం ప్రారంభిస్తారు. పుట్టినప్పుడు, పిల్లలు తమ ముందుగా త‌న తల్లి స్వరాన్ని, వారి మాతృభాషను, శబ్దం కంటే మ‌నుషుల మాట‌ల‌ను, పుట్టుకకు ముందు విన్న పాటలు లేదా కథలను వినడానికి ఇష్టపడతారు.

శిశువుల్లో వినికిడి లోపం అనేది “న్యూరో డెవలప్‌మెంటల్ ఎమర్జెన్సీ.” వినికిడి శ‌క్తికి మెద‌డే అస‌లైన కీల‌క అవ‌య‌వం. చెవులు మెదడుకు మాత్రమే శబ్దాలను ప్రసారం చేస్తాయి. వినికిడి లోపంతో జన్మించిన శిశువులు… సాధారణ వినికిడి ఉన్న పిల్ల‌ల్లా త‌మ జీవితాన్ని ప్రారంభించ‌లేరు. వారు పుట్టడానికి ముందు త‌మ శ్రవణమార్గాల్లో 20 వారాల సాధారణ అభివృద్ధిని కోల్పోతారు. పుట్టిన త‌ర్వాత జ‌రిగే ఆడిట‌రీ న్యూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ వారిలో ఉండ‌దు. వారికి వినిపించ‌డం లేద‌ని మ‌నం గుర్తించేలోపే ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. పుట్టిన త‌ర్వాత జ‌రిగే ఆడిట‌రీ బ్రెయిన్ పాత్‌వేస్ కూడా వారిలో అభివృద్ధి చెంద‌వు. మేల్కొన్న స‌మ‌య‌మంతా కూడా వినికిడి ప‌రిక‌రాలు ధ‌రిస్తేనే పిల్లలు నిరంతరం శబ్దాలు వినగ‌ల‌డు.

ఫలితాలను అనుకూలంగా చేయ‌డంలో టైమింగ్ చాలా కీలకం. పుట్టిన మొదటి వారాల్లో పిల్ల‌ల్లో వినికిడి లోపం గుర్తించి, ఒక‌వేళ ఆరు నెల‌ల త‌ర్వాత వాళ్లు సాధార‌ణ స్థాయిలో విన‌గ‌లిగితే, చాలా సానుకూల ఫ‌లితాలు ఉంటాయి. వాళ్ల ఆడిట‌రీ బ్రెయిన్ పాత్‌వేస్‌లోని న్యూర‌ల్ క‌నెక్ష‌న్లు మాట్లాడే భాష‌ను అభివృద్ధి చేయ‌డానికి మంచి అవ‌కాశం ఉంటుంది. వారికి మంచి వినికిడి అనుభ‌వాల‌ను అందించ‌గ‌లిగితేనే ఇది వాస్త‌వ‌రూపం దాలుస్తుంది. పిల్ల‌లు వినికిడి ప‌రిక‌రాల‌ను పూర్తిస్థాయిలో వాడ‌టం ఉప‌యోగించే వ‌య‌సు వ‌చ్చిన‌ప్పుడు వారి మాట్లాడే భాషా నైపుణ్యాన్ని బాగా అంచ‌నా వేయొచ్చు. దాంతోపాటు వారికి వినికిడి శ‌క్తి ఎంత దెబ్బ‌తింది, అర్థ‌వంతంగా వినే అనుభ‌వాలు వారికి ఎలా ఎదుర‌వుతున్నాయో తెలుసుకోవ‌చ్చు.
వినికిడి ఉపకరణాలు, ఎఫ్ఎమ్ వ్యవస్థలు, కాక్లియర్ ఇంప్లాంట్లు “బ్రెయిన్ యాక్సెస్‌” సాధనాలు. ఆప్టిమ‌ల్ ఆడిట‌రీ బ్రెయిన్ డెవ‌ల‌ప్‌మెంట్ జ‌రిగే కీల‌క స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలంటే, పుట్టిన త‌ర్వాత‌ సాధ్యమైనంత త్వరగా.. మెదడు వీలైనంత ఎక్కువ ధ్వనిని గ్రహించే సామర్థ్యాన్ని అందించాలి.

వినికిడి లోపం ఉన్న పిల్లలు మాటలు, భాష‌ను నేర్చుకోవ‌డంలో జీవితాంతం ఇబ్బందులు ప‌డ‌ట‌మే కాదు.. చ‌దువు నేర్చుకోవ‌డం, వ్య‌క్తిగ‌త‌-సామాజిక సంబంధాల‌లో త‌డ‌బాటు, భావోద్వేగ ప‌ర‌మైన క‌ష్టాలు కూడా ఎదుర్కొంటారు. అభివృద్ధి ప‌రంగా ఆల‌స్యం కావ‌డంతో పాటు, ఈ పిల్ల‌ల‌కు దృష్టి కేంద్రీక‌రించ‌డంలో స‌మ‌స్య‌లు, హైప‌ర్ యాక్టివిటీ డిజార్డ‌ర్‌, ఆటిజం లేదా నేర్చుకోవ‌డంలో ఇబ్బందులు కూడా వ‌స్తాయి. ఇలాంటి పిల్ల‌ల అభివృద్ధి తీరుపై త‌ప్ప‌నిస‌రిగా ప‌రిశీలించుకుంటూ ఉండాలి. కొవిడ్ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు వినికిడి సమస్యను గుర్తిస్తున్నారు, అయితే తల్లిదండ్రులు వారి పిల్ల‌ల‌కు అవసరమైన చికిత్స చేయించుకోవడానికి భయపడుతున్నారు.

పుట్టిన వెంటనే వినికిడి నష్టాన్ని కూడా మెరుగైన టెక్నాలజీతో మనం గుర్తించవచ్చు. వినికిడి సమస్య చికిత్సల ఆధారంగా వారికి వైద్యం చేయించొచ్చు, లేదా వారు వినికిడి ఉపకరణాలను ఉపయోగించాల్సి రావచ్చు లేదా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మనం స‌మ‌స్య‌ను ముందుగా గుర్తించి, మెదడును ఉత్తేజపరిచే చికిత్స ప్రారంభించాలి. కాక్లియర్ ఇంప్లాంట్ ఖర్చు ప్రతి చెవికి రూ.8,00,000 నుంచి రూ.20,00,000 వరకు ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు (సంవత్సరానికి రూ.1, 80,000 కంటే తక్కువ), 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్ల‌లున్న కుటుంబాలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ల‌ను అందిస్తోంది.

2021లో కొవిడ్ రెండోవేవ్ చాలా ఉద్ధృతంగా ఉన్నా.. మేం సుమారు 100 కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేశాము. ముందుగా చికిత్స చేయాల్సిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని, కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేయించ‌డానికి ముందుకొచ్చిన‌ తల్లిదండ్రుల మద్దతుతోనే దీన్ని మేం సాధించ‌గ‌లిగాము. వృత్తి నిపుణులుగా మేము కొవిడ్‌కు సంబంధించిన అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుని.. ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా పిల్ల‌లంద‌రికీ వినికిడి జ్ఞానాన్ని అందించ‌గలిగాము. ఈ శస్త్రచికిత్సలలో కొన్ని ప్రభుత్వ సాయంతో చేయ‌గా, మ‌రికొన్ని ప్రైవేటుగా డ‌బ్బులిచ్చి చేయించుకున్న‌వి.

మేము 12 నెలల లోపు పిల్ల‌ల‌కు అనేక శస్త్రచికిత్సలు చేశాము. శిశువుల్లో వినికిడి లోపంపై తల్లిదండ్రుల్లో అవగాహన పెరుగుతోంది. పిల్ల‌ల వినికిడి సమస్యను తల్లిదండ్రులు మొద‌ట్లోనే గుర్తించి, 6 -10 నెలల వ‌య‌సులోపే ప‌రీక్ష‌కు, చికిత్స‌కు వారిని తీసుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్లో వినికిడి సమస్యను గుర్తించడం స‌మ‌స్య‌గా ఉంది. పిల్ల‌ల‌కు 2-3 ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కూ తల్లిదండ్రులు ఈ స‌మ‌స్య‌ను గుర్తించ‌లేక‌పోతున్నారు. దీనివ‌ల్ల చికిత్స కూడా ఆల‌స్యం అవుతోంది. ఫ‌లితాలు బాగుండాలంటే, ప‌ది నెల‌ల లోపు వ‌య‌సులోనే చికిత్స ప్రారంభించాలి.