కోకాపేట భూములు హెచ్ఎండిఏ వే : హైకోర్టు
కోకాపేట భూములు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ)కే చెందుతాయని మరోసారి హైకోర్టు తీర్పు వెలువరించింది. కోకాపేట భూములపై గత 15 సంవత్సరాలుగా కోర్టుల్లో(హైకోర్టు, సుప్రీంకోర్టు) పిటిషనర్లు కేసులు వేసి ఓటమిపాలయ్యారు. గతంలో రెండు సార్లు హైకోర్టు కోకాపేట భూములపై హెచ్ఎండిఏకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఈ భూములు హెచ్ఎండిఏ కే చెందినవని గతంలో తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ కొంతమంది పిటిషనర్లు కోకపేట భూములను జేఎస్.కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గరి నుంచి కొనుగోలు చేశామని, జేఎస్.కృష్ణమూర్తి దివంగత(లేట్) నవాబ్ నస్రత్ జంగ్ బహదూర్–1కు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) హోల్డర్ అంటూ హైకోర్టులో రెండు పిటీషన్లు వేసి స్టేటస్కో ఉత్తర్వులు తెచ్చుకున్నారు. హైకోర్టులో రెండు పిటీషన్లపై హెచ్ఎండిఏ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి.గిరి వాదనలు వినిపించారు. అంతకు ముందు ఇదే వ్యక్తులు హైకోర్టులో కేసులు వేసి ఓడిపోయారని హెచ్ఎండిఏ న్యాయవాది గిరి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసు పూర్వోపరాలను విచారించిన హైకోర్టు హెచ్ఎండీఏకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా పిటీషనర్లు ఇంతకు ముందే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసు ఓడిపోయిన విషయాన్ని దాచిపెట్టి (మరుగునపెట్టి) మళ్లీ హైకోర్టులో కేసు(2019 అక్టోబర్ 8న ) వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో కోకాపేట భూములపై 2017 అక్టోబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు హెచ్ఎండిఏకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పిటీషనర్ల తీరును తీవ్రంగా పరిగణించిన హైకోర్టు వారికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. హైకోర్టు తీర్పుతో కోకాపేట భూములను అభివృద్ధి చేయాలన్న హెచ్ఎండిఏ ఆశయానికి ఆటంకం తొలగిపోయింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువజేసే కోకాపేట భూముల వివాదం హైకోర్టు తీర్పుతో సమసిపోయింది.











