రెండో విడత పైసల పంపిణి

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 డబ్బుల పంపిణి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పూర్తి కాగా, రెండో విడతలో 5లక్షల 38 వేల మందికి పోస్టాపీసు ద్వారా పంపిణి చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే కరోనాతో సహజీవనం తప్పేటట్లు లేదని సిద్దిపేట అంబేద్కర్‌ నగర్‌లో మంత్రి నేడు పేదలకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో  అన్నారు. కరుణ క్రాంతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 1,400 మందికి మంత్రి హరీశ్‌ రావు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ… అర్హులందరికీ రెండో విడత రూ. 1,500 చొప్పున పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్రంలో అనేకమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. సిద్దిపేటలో ఇప్పటికే 12 వేల మందికి సహాయం అందించినట్లు చెప్పారు. సిద్దిపేట గ్రీన్‌ జోన్‌లో ఉన్నా నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. మాస్కు ధరించకుంటే రూ. వెయ్యి జరిమానా తప్పదన్నారు. ప్రజలందరి సహకారంతో కరోనాను విజయవంతంగా ఎదుర్కొందామని పేర్కొన్నారు.