వేతనం లేని సెలవుపై గోఎయిర్ ఉద్యోగులు

ప్రైవేటు విమానయాన సంస్థ గోఎయిర్‌లోని 5500 మంది ఉద్యోగుల్లో అత్యధిక మంది ఉద్యోగులు మే 3 వరకు వేతనం లేని సెలవు (ఎల్‌డబ్ల్యూపీ)లో ఉండనున్నారు. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గో ఎయిర్ తెలిపింది. ఉద్యోగులకు వేతనాలు తగ్గించడంతోపాటు రొటేషన్ పద్ధతిలో ఎల్‌డబ్ల్యూపీకి వెళ్లాలని మార్చిలోనే గోఎయిర్ తమ సూచించింది. ‘‘లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించడంతో విమానాలన్నీ గ్రౌండ్‌కే పరిమితమయ్యాయి. కాబట్టి మే 3వ తేదీ వరకు వేతనం లేని సెలవు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’’ అని గోయిర్ శనివారం తన ఉద్యోగులకు తెలియజేసింది. అంతేకాదు, అవసరమైతే ఎల్‌డబ్ల్యూపీని పొడిగించే అవకాశం ఉందని కూడా సంస్థ పేర్కొంది. 5,500 మంది ఉద్యోగుల్లో 10 శాతం మంది మాత్రం పనిచేస్తారని, విమానాలు తిరగనప్పుడు కూడా వారి సేవలు ఎంతో కీలకమని సంస్థ తెలిపింది. వారికి మాత్రం కొంత వేతనాల చెల్లిస్తామని వివరించింది.