కంగ‌నాపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సీపీఐ నారాయ‌ణ‌

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె నారాయ‌ణ న‌టి కంగనాపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ ఆయ‌న మండిపడ్డారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న కంగన రనౌత్ సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు, కామెంట్స్ చేస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఎలాంటి విషయంలోనైనా తను స్పందించిందంటే ఏకిపారేస్తుంటుంది. ఇదే సమయంలో తీవ్ర విమర్శలకు గురౌతుంటుంది. తాజాగా దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల ఆమె ‘దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అని భిక్ష అని పేర్కొనింది. దీనిపై నారాయణ తీవ్రంగా స్పందించారు. కంగనా ఓ విలాసవంతమైన యాచకురాలు అంటూ మండిపడ్డారు. ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసునని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ స్వతంత ఉద్యమంపై మాట్లాడే అర్హత కంగనాకు లేదని, ఆమెకు పద్మశ్రీ ఇచ్చిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు కూడా దేశ స్వతంత ఉద్యమంపై మాట్లాడే అర్హత లేదన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పడం ఆమె బానిస మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. అంతేకాదు, కంగనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తక్షణమే దేశ ప్రజలకు బహిరంగంగా ఆమె క్షమాపణలు చెప్పాలని నారాయణ డిమాండ్‌ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.