ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు, ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించడానికి మేడారంకు తరలివస్తుంటారు. ముఖ్యంగా వారాంతాలు, సెలవుదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేడారం ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా మేడారంలో పర్యటించనున్నారు. మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై పూజారులు, ఆదివాసీ నేతలు, గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్తారు. ఇప్పటికే సోమవారం ఆయన కార్యాలయంలో అధికారులు, మంత్రులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఏమిటంటే ప్రతి నిర్మాణం ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలనేది. ఈ క్రమంలో గ్రానైట్, లైమ్స్టోన్ వంటి సహజ పదార్థాలను వినియోగించాలని నిర్ణయించారు. స్థపతి ఈమని శివనాగిరెడ్డి మార్గదర్శకత్వంలో పనులు సాగనున్నాయి.గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడం, ద్వారాల సంఖ్య పెంచడం, భారీ స్వాగత తోరణాల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ప్రత్యేకంగా తోరణాల ఎత్తు 40 అడుగుల వరకు పెంచాలని యోచిస్తున్నారు. భక్తుల రద్దీ సమయంలో తోపులాటలు జరగకుండా క్యూలైన్లను బలపరుస్తారు. గద్దెల చుట్టూ ర్యాంపులు, ఎత్తైన ప్రదేశాలు నిర్మించి భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. రూ.150 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక వచ్చే ఏడాది జనవరి చివర్లో జరగబోయే మహా జాతర దృష్ట్యా ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. అందులో రూ.91 కోట్లు రోడ్ల విస్తరణ, వంతెనలు, కాలువల నిర్మాణానికి వినియోగించనున్నారు. మిగిలిన నిధులతో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలు, భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతులు కల్పించనున్నారు.