కర్నూలు కిమ్స్కు ప్రతిష్ఠాత్మక సర్టిఫికెట్
పరిశుభ్రత పాటించడంలో హైమ్ ఇంటర్నేషనల్ గుర్తింపు
కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ పరిశుభ్రత పాటించడం, సిబ్బంది పాటిస్తున్న అలవాట్లు తదితర అంశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించి, గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ సర్టిఫికెట్ బహూకరించింది. కర్నూలు జొహరాపురం రోడ్డులో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది మొత్తం రోగుల ఆరోగ్యరక్షణతో పాటు పరిశుభ్రతకు కూడా పెద్దపీట వేశారని, ఈ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వారి తీరు ఉందని హైమ్ సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. తాము ఆసుపత్రిని పూర్తిగా పరిశీలించి, ఈ సర్టిఫికెట్ అందించడానికి కర్నూలు కిమ్స్ అన్నివిధాలా అర్హత కలిగినట్లు గుర్తించామని వివరించారు. హైమ్ సంస్థ వివిధ విభాగాల్లో ఈ సర్టిఫికెట్లు అందిస్తుండగా, కిమ్స్ ఆసుపత్రికి ఆరోగ్య సేవల విభాగంలో ఇచ్చారు. ముఖ్యంగా కొవిడ్ -19 విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని, ఈ విషయంలో తాము ఆన్లైన్ వీడియో కాల్స్ ద్వారా ఆడిట్ నిర్వహించి, వైద్యులు, సిబ్బంది, రోగులను విచారించి ఈ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఆ ప్రకటనలో హైమ్ సంస్థ తెలిపింది. ఐసీయూలు, వార్డులలో కూడా గమనించి.. పలువురిని ఇంటర్వ్యూ చేసిన తర్వాతే ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పింది. అన్ని విభాగాల్లోనూ కర్నూలు కిమ్స్ ఆసుపత్రి ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, అందువల్లే గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ సర్టిఫికెట్ అందించామని హైమ్ సంస్థ వివరించింది. ఈ నేపథ్యంలో కర్నూల్ కిమ్స్ ఆసుపత్రి సెంటర్ హెడ్ జీ.రంజిత్ హర్షం వ్యక్తం చేశారు. హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ తాము అనుసరించే ప్రమాణాలన్నిటినీ గుర్తించి ఈ గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ సర్టిఫికెట్ని బహుకరించడం ఎంతో ఆనందదాయకమనీ, భవిష్యత్తులో కూడా ఈ ప్రమాణాలని పాటిస్తూ వైద్యులకు, సిబ్బందికి, రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆయన అన్నారు.