పందుల నుంచి గుండె మార్పిడి ఓ వ‌రం :డా. సందీప్ అత్తావ‌ర్‌

యూనివ‌ర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు విజ‌య‌వంతంగా ప్ర‌పంచంలోనే తొలిసారిగా పంది గుండెను మ‌నిషికి అమ‌ర్చారు. ఇది ఆధునిక వైద్య‌శాస్త్ర చ‌రిత్ర‌లోనే స‌రికొత్త అధ్యాయం. ఆ సంస్థ నుంచి వ‌చ్చి తాజా స‌మాచారం ప్ర‌కారం 57 ఏళ్ల వ్య‌క్తికి ఆ గుండె స‌ర్వ‌సాధార‌ణంగా, ఎలాంటి సాయం లేకుండా కొట్టుకుంటోంది.

అవ‌య‌వాల కొరత తీవ్రంగా ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో అవ‌య‌వ మార్పిడి చికిత్స‌ల‌కు ఇది ఒక ఆశాదీపం లాంటిద‌ని, కొన్ని సంవ‌త్స‌రాల పాటు చేసిన ప‌రిశోధ‌న‌ల ఫ‌లితంగానే ఇది సాధ్య‌మైంద‌ని దేశంలోనే ప్ర‌ధాన‌మైన ఆసుప‌త్రుల‌లో ఒక‌టైన కిమ్స్ ఆసుప‌త్రి అనుబంధ సంస్థ కిమ్స్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్, ప్రోగ్రాం డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సందీప్ అత్తావ‌ర్ అన్నారు. ఆయ‌న చెప్పిన విష‌యాలు ఇలా ఉన్నాయి… “ప్ర‌తియేటా అవ‌య‌వాలు పాడై ల‌క్ష‌లాది మంది ఇబ్బంది ప‌డుతుంటారు. త‌మ‌కు స‌రిప‌డ అవ‌య‌వ‌దాత‌లు దొర‌క్క వారిలో చాలామంది మ‌ర‌ణిస్తుంటారు కూడా. ఇలాంటి ఇబ్బందుల‌తో తీవ్రంగా బాధ‌ప‌డేవారికి, మ‌ర‌ణానంత‌రం అవ‌య‌వ‌దానాలు చేసేవారి నుంచి వారికి స‌రిపోయే అవ‌య‌వం దొర‌క‌డ‌మే ఏకైక ప‌రిష్కారం.

అందుబాటులో ఉన్న స‌మాచారాన్ని బ‌ట్టి తుదిద‌శ గుండె వైఫ‌ల్యంతో ఒక్క అమెరికాలోనే 50వేల మంది బాధ‌ప‌డుతున్నారు. వారికి గుండెమార్పిడి అవ‌స‌రం. ప్ర‌స్తుతం బ్రెయిన్ డెడ్ అయిన‌వారి నుంచే గుండె సేక‌రిస్తున్నాం. కానీ బీటింగ్ హార్ట్ కావాలంటే కేవ‌లం 4వేలు మాత్ర‌మే ఉన్నాయి. దీనివ‌ల్ల అందుబాటులో ఉన్న ఇత‌ర స‌జీవ అవ‌య‌వాల కోసం గాలింపు మొద‌లైంది. ఈ స‌మాచారాన్ని భార‌తదేశానికి అన్వ‌యిస్తే, ఇక్క‌డి జ‌నాభాను బ‌ట్టి, ఇక్క‌డి వ్యాధి తీవ్ర‌త‌ల‌ను బ‌ట్టి ఈ అంకెలు క‌నీసం ఆరు రెట్లు ఎక్కువ ఉంటాయి. ప్ర‌స్తుతం మ‌న దేశంలో అవ‌య‌వ‌దానాలు ఏడాదికి కేవ‌లం వెయ్యి మాత్రమే ఉన్నాయి.

కిడ్నీ/ లివ‌ర్‌/ ఊపిరితిత్తులు, పాంక్రియాస్ లాంటి అవ‌య‌వాలు విఫ‌ల‌మై తీవ్రంగా బాధ‌ప‌డుతున్న వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, ఇలాంటి అవ‌య‌వాల అవ‌స‌రం చాలా ఉంది. ప్ర‌త్యామ్నాయం ఏమీ లేక‌పోవ‌డంతో ఈ అనూహ్య మార్పు మ‌న అనుమానాల‌న్నింటికీ స‌మాధానం కావ‌చ్చు.

ఏదైనా అవ‌య‌వం కొద్దిగా పాడైతే, ఆ త‌ర్వాత శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వ వ్య‌వ‌స్థ‌ల‌కు కూడా చెప్ప‌లేనంత న‌ష్టం క‌లుగుతుంది. దానివ‌ల్ల జీవ‌న‌నాణ్య‌త దెబ్బ‌తిని, ప్రాణాల‌కే ముప్పు ఏర్ప‌డుతుంది. స‌రైన స‌మ‌యానికి అవ‌య‌వాలు మారిస్తే ఇత‌ర అవ‌య‌వాల‌కు ముప్పు త‌గ్గడ‌మే కాదు, అది జీవ‌న నాణ్య‌త‌ను మెరుగుప‌రిచి, త‌ర‌చు ఆసుప‌త్రుల్లో చేరాల్సిన అవ‌స‌రాన్ని, అపార వైద్య‌ఖ‌ర్చుల‌ను కూడా త‌గ్గిస్తుంది. అందువ‌ల్ల పాడైన అవ‌య‌వాల‌ను స‌మయానికి మార్చ‌డం రోగులు, వారి కుటుంబ‌స‌భ్యులు, స‌మాజం మొత్తానికి చాలా అవ‌స‌రం. ప్ర‌స్తుతం మ‌న‌కు శాస్త్రీయంగా, నైతికంగా, సామాజికంగా, మ‌త‌ప‌రంగా ఉన్న ప‌రిమితుల వ‌ల్ల ప్ర‌త్యామ్నాయ మార్గాలు త‌ప్ప‌నిస‌రి అవుతున్నాయి.

చింపాంజీలు, బ‌బూన్లు మ‌న‌కు మంచి వ‌న‌రులు కావ‌చ్చు గానీ నైతికంగా, వైద్య‌ప‌రంగా, శాస్త్రీయంగా ఉన్న కార‌ణాల‌తో ఈ ప్ర‌త్యామ్నాయాన్ని చూడ‌లేక‌పోతున్నాం. ప‌రిశుభ్రంగా పెంచి, జ‌న్యుప‌రివ‌ర్త‌నం చేసిన పందులు ఈ దిశ‌గా చాలా పెద్ద అడుగు. ప్ర‌యోగ‌శాలల్లో మార్చి, ప‌లు జ‌న్యువుల‌ను తీసేసి, పీఈఆర్‌వీ (పోర్కైన్ రెట్రోవైర‌స్‌) లేని పందిపిల్ల‌ల్లో మ‌నిషికి సంబంధించిన జ‌న్యుమార్పిడులు చేయొచ్చు. ప్ర‌త్యేక పెంప‌కం, ఆహార ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తే, బ‌య‌టి నుంచి వైర‌స్‌లు (పీఈఆర్‌వీ) వ‌చ్చే ముప్పును మ‌నం త‌గ్గించొచ్చు. అదే స‌హ‌జంగా లోప‌ల ఉండే పీఈఆర్‌వీని సీఆర్ఐఎస్‌పీఆర్‌-కాస్ 9 జ‌న్యువును మార్చ‌డం, పిండాన్ని న్యూక్లియ‌ర్ ఎడిటింగ్ చేయ‌డం ద్వారా తీసేయొచ్చు.

కాల‌క్ర‌మంలో శాస్త్రవేత్త‌లు గుండెను కూడా 3డి ప్రింటింగ్ చేసే అవ‌కాశం ఉంది. అవి పూర్తిగా సుర‌క్షితంగా ఉంటాయి, అవైతే ఇక రోగుల‌కు ఇమ్యునోస‌ప్రెసెంట్లు ఇవ్వ‌క్క‌ర్లేదు. ఇది స‌రైన ప‌రిష్కారం అవుతుంది. అయితే ఈ దిశ‌గా ఇంకా ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. శాస్త్రీయంగా కూడా ఇది మంచి ప్ర‌త్యామ్నాయ‌మేన‌ని చెబుతున్నారు. అయితే, పూర్తిస్థాయిలో ప‌నిచేసే అవ‌య‌వాన్ని త‌యారుచేయ‌డానికి ప‌ట్టే స‌మ‌యం, ఖ‌ర్చు దృష్ట్యా పెద్ద‌మొత్తంలో వీటిని అప్పుడే చేయ‌లేం. అప్ప‌టివ‌ర‌కు మ‌నిషి ప్రాణాలు కాపాడేందుకు ఈ ప్ర‌త్యామ్నాయం ఉప‌యోగ‌ప‌డుతుంది. తాజా ప్ర‌యోగం వైద్య‌శాస్త్రంలో ఒక ప్ర‌ధాన‌మైన మైలురాయి లాంటిది. దీన్ని జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ, మ‌రింత మెరుగుప‌ర‌చాలి.”

(మూడు ద‌శాబ్దాలుగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల‌కు సంబంధించిన ప‌లు ర‌కాల స‌మ‌స్య‌ల‌కు చికిత్స చేస్తున్న అనుభ‌వం ఉన్న డాక్ట‌ర్ సందీప్ అత్తావ‌ర్… ఇప్ప‌టివ‌ర‌కు 332 అవ‌య‌వ మార్పిడి శ‌స్త్రచికిత్స‌లు చేశారు. వీటిలో 203 ఊపిరితిత్తుల మార్పిడులు, 92 గుండె మార్పిడులు, 37 గుండె, ఊపిరితిత్తుల మార్పిడులు ఉన్నాయి.)