నామినేష‌న్లు వేసిన వైకాపా అభ్య‌ర్థులు

ఏపీలో రాజ్య‌స‌భ స్థానాల‌కు న‌లుగురు వైకాపా అభ్యర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఇటీవ‌ల తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌ను కూడా ఏపీ నుండి రాజ్య‌స‌భ‌కు పంప‌డానికి సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డిని మ‌రోమారు రాజ్య‌స‌భ‌కు పంపేందుకు నిర్ణ‌యించిన వైసీపీ మిగిలిన మూడు స్థానాల‌కు బీద మ‌స్తాన్ రావు, నిరంజ‌న్ రెడ్డి, ఆర్.కృష్ణ‌య్య‌ల‌ను ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో బుధ‌వారం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు రిట‌ర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శాస‌న మండలి ఉప కార్య‌ద‌ర్శి పీవీ సుబ్బారెడ్డికి వైసీపీ అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్లను అంద‌జేశారు. ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ, కారుమూరి నాగేశ్వ‌ర‌రాలు వెంట రాగా వైసీపీ అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేశారు.