జెఎస్‌డబ్ల్యు ట్రేడ్‌మార్క్స్‌తో అక్రమాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు గంగాధర్‌ అనే వ్యక్తిని జెఎస్‌డబ్ల్యు సంస్థ లోగోలు, ట్రేడ్‌మార్క్స్‌ను అక్రమంగా వినియోగిస్తున్నందుకు అరెస్ట్‌ చేశారు. జీడిమెట్లలోని ఐడీఏ ఫేజ్‌–1లో ప్లాట్‌ నెంబర్‌ 89/బీ వద్దనున్న సెప్రో రూఫింగ్‌ సిస్టమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వద్ద వీరు నకిలీ ఉత్పత్తులను తయారుచేయడం తో పాటుగా వాటిని సరఫరా చేస్తున్నారు. సైబరాబాద్‌ పొలీసులు ఈ స్థావరంపై దాడులు చేసి జెఎస్‌డబ్ల్యు లోగోలను ప్రచురించిన నకిలీ వస్తువులు, దీనితో పాటుగా ప్రొఫైలర్‌ మెషీన్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. సంస్థ లోగోలను, ట్రేడ్‌మార్క్స్‌ను అక్రమంగా వాడటంతో పాటుగా మోసపూరితంగా వ్యవహరిస్తున్నందుకు గంగాధర్‌పై కేసులు నమోదు చేశారు.

సెప్రో రూఫింగ్‌ సిస్టమ్‌, అమాయక వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతో పాటుగా తాము విక్రయిస్తున్న నకిలీ ఉత్పత్తులు అసలైన జెఎస్‌డబ్ల్యు స్టీల్‌ కోటెడ్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ఉత్పత్తులుగా చలామణి చేస్తుంది.

ప్రజా ప్రయోజనార్థం స్థానిక ఉద్యమనేత శ్రీ జి.విజయ్‌కుమార్‌ దాఖలు చేసిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఈ దాడులు చేయడంతో పాటుగా నకిలీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ పోలీస్‌ బృందానికి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఐ) శ్రీ కిశోర్‌ నేతృత్వం వహించగా, బాలానగర్‌, సైబరాబాద్‌లలోని స్పెషల్‌ ఆపరేషన్స్‌ బృందాలతో పాటుగా జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ శ్రీ గౌతమ్‌ కటకం తదితరులు పాల్గొన్నారు.