కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఖాళీలు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గ్రూప్ ఏ పోస్టులు 23,584, గ్రూప్ బీ పోస్టులు 1,18,807, గ్రూప్ సీ పోస్టులు 8,36,936. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ఈ విషయం తెలిపారు. వివిధ కేంద్ర శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) పోస్టుల ఖాళీల సంఖ్యపై కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఆగస్ట్‌ నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖలో 2,93,943 ఖాళీలు, రక్షణ (సివిల్) శాఖలో 2,64,704 ఖాళీలు, హోం వ్యవహారాల శాఖలో 1,43,536 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు వివరించారు.

‘రైల్వేలో మొత్తం 15,14,007 పోస్టులు ఉండగా, 2,93,943 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం రైల్వేలో 12,20,064 మంది ఉద్యోగులున్నారు. అదేవిధంగా డిఫెన్స్ (సివిల్)లో 6,46,042 పోస్టులు మంజూరుకాగా 2,64,707 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హోం వ్యవహారాల శాఖలో మంజూరైన 10,85,728 పోస్టుల్లో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని లోక్‌సభకు తెలిపారు.

మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో 446 పోస్టులు మంజూరుకాగా 129 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. అలాగే రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో మంజూరైన 380 పోస్టులకు 91 ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పీఎస్‌యూలు, స్వయంప్రతిపత్త సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా 1.47 లక్షల కొత్త నియామకాలు జరిగాయని వెల్లడించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.