గంగులపై వైస్సార్సీపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఫైర్

ప్రస్తుతం టిఆర్ఎస్ , వైస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హరీష్ రావు చేసిన కామెంట్స్ ఫై వైస్సార్సీపీ నేతలు కౌంటర్లు వేయగా, వైస్సార్సీపీ నేతల కౌంటర్ల కు టిఆర్ఎస్ నేతలు అదే స్థాయిలో రీ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా శనివారం మంత్రి గంగుల చేసిన కామెంట్స్ ఫై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనం అని విమర్శించారు. రాజకీయాల్లో ఇష్టంవచ్చినట్టు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఏపీ ఉద్యోగుల విషయంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపైనే సజ్జల స్పందించారని స్పష్టం చేశారు. మాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాం అన్న వ్యాఖ్యలను మంత్రి గంగుల ఉపసంహరించుకోవాలని వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.

అసలు గంగుల ఏమన్నారంటే.. కేసీఆర్‌ సారథ్యంలోని జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ పాగా వేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబంలాంటిదైతే.. కేసీఆర్‌ తండ్రిలాంటి వారన్నారు. తమ కుటుంబంలోంచి ఒకరిని వేరుచేసే కుట్రలు ఫలించవచ్చన్నారు. బీజేపీకి బీ టీమ్‌లా పని చేస్తూ.. ఎదురించే ధైర్యం లేకుండా రైతుల పొట్టకొట్టేలా మీటర్లు పెట్టిన ఏపీ ప్రభుత్వం ఎక్కడ.. ధైర్యంగా బీజేపీని ఎదిరించిన సీఎం కేసీఆర్‌ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీలో కేసీఆర్‌ నాయకత్వం కావాలని ఫ్లెక్సీలు వెలిసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశానికి మార్గదర్శకంగా ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వైసీపీ జతకలిసిందని ఆరోపించారు.